హైకోర్టును ఆశ్రయించిన బండి సంజయ్ కుమారుడు
- బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు
- 17 ఏళ్ల బాలికను వేధించాడంటూ కేసు నమోదు
- కేసు కొట్టివేయాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించిన బండి సంజయ్
తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ తనపై నమోదైన పోక్సో కేసును సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
తనపై నమోదైన కేసులో ఎలాంటి వాస్తవం లేదని, ఆ కేసును కొట్టివేయాలని కోరుతూ భగీరథ్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై ఈ నెల 14వ తేదీన (బుధవారం) హైకోర్టు వెకేషన్ బెంచ్లో విచారణ జరగనుంది. న్యాయస్థానం ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
కేసు వివరాల్లోకి వెళితే... ఒక 17 ఏళ్ల మైనర్ బాలికను భగీరథ్ వేధిస్తున్నాడంటూ ఆ బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మే 8వ తేదీన హైదరాబాద్లోని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. అయితే, ఈ ఆరోపణలను భగీరథ్ తరపున వర్గాలు ఖండిస్తున్నాయి. ఇది కావాలని చేస్తున్న కుట్రగా వారు పేర్కొంటున్నారు.
మరో ఆసక్తికరమైన మలుపు ఏంటంటే... ఆ బాలిక, ఆమె తల్లి తనను డబ్బు కోసం బ్లాక్మెయిల్ చేస్తున్నారని, బెదిరింపులకు పాల్పడుతున్నారని భగీరథ్ కూడా ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు అదే రోజు (మే 8) కరీంనగర్ పోలీసులు బాలిక, ఆమె తల్లిపై కేసు నమోదు చేశారు. ఈ రెండు కేసుల విచారణ ప్రస్తుతం కొనసాగుతోంది.